కత్తులతో బెదిరించి అత్యాచారం.. హైదరాబాద్‌లోని మీర్‌‌పేటలో ఘటన

కత్తులతో బెదిరించి అత్యాచారం.. హైదరాబాద్‌లోని మీర్‌‌పేటలో ఘటన
  • గంజాయి మత్తులో బాలికపై ముగ్గురు యువకుల ఘాతుకం 
  • నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

ఎల్​బీ నగర్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని మీర్ పేటలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు కత్తులతో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం మీర్ పేట పరిధిలోని తన సోదరి ఇంటికి తమ్ముడితో కలిసి బాధిత బాలిక వచ్చింది. అదేరోజు స్థానిక యువకుడు ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించడంతో అడ్డుకుంది. దీంతో అతడు మరో ఏడుగురితో కలిసి సోమవారం ఉదయం బాలిక సోదరి ఇంట్లోకి కత్తులతో వచ్చి బెదిరించాడు.

గంజాయి మత్తులో ఉన్న దుండగులు ఇంట్లోని వారిపై దాడి చేశారు. ఆ తర్వాత ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. ఆమె తమ్ముడి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ చౌహాన్ పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.