
కర్నూలు జిల్లా, నంద్యాల, ఆత్మకూరు : ఇటీవల నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలోని పెద్ద గుమ్మాడాపురం గ్రామాల్లో పెద్ద పులి పిల్లలు లభ్యమైన ఘటన కలకలం రేపింది. ఓ పులి ఊళ్లోకి వచ్చి నాలుగు ఆడ పులులకు జన్మనిచ్చిన విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడిన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వివరాలు తెలియజేశారు. ప్రస్తుతం తల్లికి దూరమైన నాలుగు ఆడ పులి పిల్లలు అటవీ శాఖ అధికారులు సంరక్షణలో క్షేమంగా ఉన్నాయి. తల్లి పులి వయస్సు 8 సంవత్సరాలు ఉండొచ్చని షారెస్ట్ అధికారులు తెలిపారు. తల్లి పులిని టైగర్ నంబర్ 108 గా గుర్తించారు.
ఫారెస్ట్ సిబ్బంది పులి పిల్లలు దొరికిన ప్రాతంలో తల్లి పులి అరుపులు విన్నారు. దాంతో ఆ ప్రాంతంలో తల్లి పులి కోసం గాలిపు చర్యలు చేపట్టారు. అయితే, ఈ నేపథ్యంలో మాట్లాడిన అధికారి.. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమని, చాలా ఉద్రేకంగా ఉంటుందని, దాని ఎత్తుల్ని అత్యంత జాగ్రత్తగా అంచనా వేయాలని సిబ్బందికి సూచించారు.
తల్లి పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా తల్లి వద్దకు పులి పిల్లలను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దూరమైన పిల్లలను తల్లి పులి చేరదీస్తుందో లేదో చూసి.. పిసిసిఎఫ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్వచంద సంస్థలతో కమిటీ వేశారు. తల్లి పులి జాడ తెలియకపోతే రెండేళ్లు పులి పిల్లలను సంరక్షించి అటవీ ప్రాంతంలో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్ద పులి ఒకే సారి నాలుగు పిల్లలకు పులి జన్మనివ్వడం చాలా అరుదు. పైగా అన్నీ అడ పులులు కావడం దేశ చరిత్రలోనే అత్యంత అరుదు.