- కార్గో, ఎంఆర్వో ఫెసిలిటీస్ కల్పించాలి
- దేవరకద్రలో డీఆర్డీవో ప్రాజెక్టు మంజూరు చేయాలని రిక్వెస్ట్
- ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’కు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ డెవలప్మెంట్లో భాగమైన ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్, దేవరకద్రలో డీఆర్డీవో ప్రాజెక్ట్, రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ వికాస్రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కే ఎస్. శ్రీనివాసరాజు, సీఎం సెక్రటరీ మాణిక్రాజ్, స్పెషల్ సెక్రటరీ కో–ఆర్డినేషన్ అద్వైత్ కుమార్సింగ్ పాల్గొన్నారు. అలాగే, తెలంగాణకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూ సేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐఏఎఫ్ ఆధ్వర్యంలో రానున్న ఎయిర్పోర్ట్ దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశమైందని అన్నారు. ఈ దిశలో భారీగా విస్తరిస్తున్న ఈ ఎయిర్పోర్ట్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ అనుకూలం
భారత వాయుసేన టెర్మినల్, ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్తోపాటు కార్గో, ఎంఆర్వో (ఎంఆర్వో), హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని రాజ్నాథ్సింగ్ను సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్లైన్స్.. తమ హ్యాంగర్స్ను ఏర్పాటు చేసుకోవడానికి సరైన ప్రదేశాలను అన్వేషిస్తున్నాయన్నాయని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.
ఈ విషయంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమైందన్నారు. ఆ దిశగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే, తమ కీలకమైన ప్రాజెక్టు ఏర్పాటుకు డీఆర్డీవో/డీఆర్డీఎల్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీప ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నందున.. ఆ ప్రాజెక్ట్ను త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
