అమెరికా కఠిన నిబంధనలు..ఇతర దేశాలకు ఇండియన్లు

అమెరికా కఠిన నిబంధనలు..ఇతర దేశాలకు ఇండియన్లు
  • కెనడా, యూఏఈ, జర్మనీ, సింగపూర్​, ఫ్రాన్స్​, సౌత్​ కొరియావైపు మొగ్గు
  • కొత్తగా ‘ఎండ్ ​హెచ్​1బీ వీసా అబ్యూజ్​ యాక్ట్​ 2026’ బిల్లును తెచ్చిన అమెరికా
  • వార్షిక వీసాల సంఖ్య 65 వేల నుంచి 25 వేలకు కుదింపు
  • వార్షిక వేతనం రూ.2  కోట్లుంటేనే వీసా.. విద్యార్థుల ఆప్ట్​ ప్రోగ్రామ్​ రద్దు
  • డిపెండెంట్​ ఉద్యోగ వీసా హెచ్​4 రద్దు చేసేలా కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • అమెరికాకు తగ్గిన స్టూడెంట్​ వీసాల అప్లికేషన్లు
  • తొలి ప్రాధాన్యంగా కెనడా.. ఆ తర్వాత జర్మనీ వైపు మనోళ్ల చూపు

హైదరాబాద్, వెలుగు: వీసా రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమెరికా కఠినతరం చేస్తుండడంతో ఇండియన్స్​ ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు. ఏటా ఇచ్చే వీసాల సంఖ్యను తగ్గించేస్తుండడం, దానికితోడు కొత్త నిబంధనలు పెడుతుండడంతో ఇప్పటికే అక్కడ ఉంటున్న ఇండియన్లు అమెరికాను వీడాలనుకుంటున్నారు. దానికితోడు అమెరికాకు స్టూడెంట్​ వీసా అప్లికేషన్లూ తగ్గిపోతున్నాయి. అమెరికాలో ఉంటున్న ఇండియన్లలో దాదాపు 40 శాతం మంది దాకా ఆ దేశాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో తేటతెల్లమైంది.

అంతేగాకుండా.. నిరుడు ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టూడెంట్ల వీసాలకు పెట్టుకున్న అప్లికేషన్లలో 25 వేల దాకా తగ్గుదల కనిపించింది. అమెరికా కాకుండా కెనడా, జర్మనీ, బ్రిటన్​, యూఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్​, సౌత్​ కొరియా, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి దేశాలవైపు చూస్తున్నారు. ఇమిగ్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, తెస్తున్న కొత్త నిబంధనలే ఇతర దేశాలవైపు ఇండియన్స్ మొగ్గుచూపేలా చేస్తున్నాయని ఇమిగ్రేషన్​ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్​ చెబుతున్నారు. 

రెండు వారాల క్రితం ట్రంప్​ ప్రభుత్వం.. అమెరికా కాంగ్రెస్​లో ‘ఎండ్​ హెచ్​1బీ వీసా అబ్యూజ్​ యాక్ట్​ 2026’ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పాసైతే ఇండియన్లు సహా.. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి పెద్ద ఎదురుదెబ్బగానే అది మిగిలిపోనున్నది. ట్రంప్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ బిల్లు ప్రకారం.. మూడేండ్లపాటు హెచ్​1 బీ వీసాలను నిలుపుదల చేస్తారు. అంతేగాకుండా.. ఏటా 65 వేల హెచ్​1బీ వీసాలను జారీ చేస్తుంటారు. ఆ సంఖ్యను ఈ కొత్త బిల్లు ద్వారా 25 వేలకు తగ్గించనున్నారు. 

ఇక, హెచ్​1బీ వీసా రావాలంటే కనీసం 2 లక్షల డాలర్ల (సుమారు రూ.1.90 కోట్ల) వార్షిక వేతన ప్యాకేజీ ఉండాలన్న నిబంధనను పొందుపరిచారు. ఇంతకుముందు ఆ వేతన పరిమితి 65 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లుగా (సుమారు రూ.62 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు) ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని పెంచడం వల్ల ఆ శాలరీ రేంజ్‌‌‌‌లో ఉండే ఉద్యోగులు తక్కువగా ఉండనున్నారు. ఎక్కువ మంది లక్ష డాలర్లలోపు ఉన్న వాళ్లనే ఇప్పటిదాకా కంపెనీలు అమెరికాకు రీలొకేట్​ చేసుకునేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. 

ఎఫ్​1 వీసా మీద అమెరికాకు మాస్టర్స్​ చదువుకునేందుకు వచ్చే స్టూడెంట్లకు.. ఆ తర్వాత హెచ్​1బీ వీసా ద్వారా ఉద్యోగం చేసుకునేందుకు ఆప్ట్​ (ఓపీటీ– ఆప్షనల్​ ప్రాక్టికల్​ ట్రైనింగ్​) ప్రోగ్రామ్​ ఉండేది. కానీ, ఇప్పుడు కొత్త బిల్లు ద్వారా ఆప్ట్​ ప్రోగ్రామ్‌‌‌‌ను ట్రంప్​ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఈ నిర్ణయం నష్టం చేసేదే. అంటే చదువు పూర్తవ్వగానే అమెరికా నుంచి తిరిగి వచ్చేయడమో లేదంటే.. పై చదువులకు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక, హెచ్​1బీ వీసాల నుంచి గ్రీన్​కార్డులుగా మార్చుకునే ఆప్షన్‌‌‌‌నూ ఎత్తేయనున్నది. ఇప్పటికే హెచ్​1బీ వీసా ఉన్న వ్యక్తుల భార్య లేదా భర్త (డిపెండెంట్​) జాబ్​ చేసే హెచ్​4 వీసాలనూ రద్దు చేయనున్నది. 

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతున్నది. నిరుడు ఫిబ్రవరిలో 3,78,787 మంది విద్యార్థులు ఎఫ్​1 వీసాకు దరఖాస్తు చేసుకుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ సంఖ్య 3.52 లక్షలకు పడిపోయింది. అంటే 26 వేలకుపైగా దరఖాస్తులు తగ్గాయి. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది అప్లికేషన్ల సంఖ్య 7 శాతం తగ్గింది. ఇక, అప్లికేషన్లు పెట్టుకున్నా.. అప్రూవ్​ అవుతున్న వాటి సంఖ్య కూడా తక్కువగానే ఉంటున్నది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్రూవల్​ రేట్​ 37 శాతం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

తొలి ప్రాధాన్యం అక్కడికే..

అమెరికా విధిస్తున్న కఠినమైన షరతులతో చాలామంది ఇండియన్లు తొలి ప్రాధాన్యంగా కెనడావైపు మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు. ఆ దేశంలో సరళతరమైన ఇమిగ్రేషన్​ నిబంధనలుండడం, త్వరగా శాశ్వత నివాస హోదా వస్తుండడంతో కెనడాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ తర్వాత జర్మనీ కూడా ఇండియన్స్‌‌‌‌కు మంచి ఆప్షన్‌‌‌‌గా కనిపిస్తున్నది. దానికి కారణం.. ఎక్కువ మంది ఇండియన్లను ఆకర్షించేలా జర్మనీ ఆపర్చునిటీ కార్డ్​ (చాన్సెన్​కార్ట్​)ను తీసుకొచ్చింది. 

దాని ద్వారా ఒక సంవత్సరంపాటు స్కిల్డ్​ ఇండియన్​ వర్కర్లు అక్కడ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దానిని పొడిగించుకునేందుకు చాన్స్‌‌‌‌ ఇస్తారు. ఇప్పుడు ఇండియన్లు చూస్తున్న మరో దేశం యూఏఈ. అక్కడ నైపుణ్యం కలిగిన వారికి ఆ దేశం ఐదేండ్ల గ్రీన్​ వీసాను అందిస్తున్నది. అంతేకాదు.. అక్కడ సంపాదనపై ట్యాక్స్‌‌‌‌లు కూడా రద్దు చేసింది. దీంతో చాలా మంది ఆ దేశంవైవపు మొగ్గు చూపుతున్నట్టు ఎక్స్‌‌‌‌పర్ట్స్​ చెబుతున్నారు. 

ఫ్రాన్స్, సింగపూర్, సౌత్​కొరియా, లండన్‌‌‌‌లాంటి దేశాలవైపు కూడా ఇండియన్స్​ చూస్తున్నారు. స్కిల్డ్​ వర్కర్ల కోసం ఆయా దేశాలు ప్రత్యేకమైన వీసాలను జారీ చేస్తున్నాయి. అంతేకాదు.. అసలు అమెరికాలో ఉంటున్న చాలా మంది ఇండియన్లు స్వదేశానికి వచ్చి ఇక్కడే ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు పెట్టాలనీ యోచిస్తున్నట్టు ఇమిగ్రేషన్​ ఎక్స్‌‌‌‌పర్ట్స్​ చెబుతున్నారు.