తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం..ఆగమొక్తంగా పూజా కార్యక్రమాలు

తిరుమలలో  ఘనంగా అనంత పద్మనాభ వ్రతం..ఆగమొక్తంగా పూజా కార్యక్రమాలు

తిరుమలలో   ఈ రోజు ( సెప్టెంబర్​ 6) ఉదయం 6 గంటలకు   అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.  ఈ సందర్భంగా ఉదయం 6 గంట‌లకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకువెళ్లి అర్చకులు ఆగమొక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. 

 అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడిపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

ALSO READ : ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర

శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో, అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే ప్రాధాన్యత  ఉంది. ప్రతి ఏటా  అనంత చతుర్దశి  పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది.

 తిరుమల  శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు.. ఈ కార్యక్రమంలో టెంపుల్ డిప్యూటీ ఈఓ లోకనాధం, ఆలయ పారుపత్తేదార్ బాలా కుమార్ తదితరులు పాల్గొన్నారు...