శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. క‌ల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి దర్శనం

శ్రీవారి సాలకట్ల  బ్రహ్మోత్సవాలు..  క‌ల్పవృక్ష వాహనంపై  మలయప్పస్వామి దర్శనం

 తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శ‌నివారం (సెప్టెంబర్​ 27) శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో క‌ల్పవృక్ష వాహనంపై భక్తులకు క‌టాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. కాని క‌ల్పవృక్షం కోరుకున్న  ఫలాలను  ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు  శ్రీ‌వారు ద‌ర్శన‌మిచ్చారు.

►ALSO READ | తెలంగాణలో వరదలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 ఈ రోజు ( సెప్టెంబర్​ 27)   రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స‌ర్వభూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.  వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్  బీఆర్ నాయుడు, ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌, రాజ్యసభ సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  ప‌లువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో  ముర‌ళికృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.