తిరుమల వెంకన్నకు పింక్ డైమండే లేదు.. అది కెంపు మాత్రమే

తిరుమల వెంకన్నకు పింక్ డైమండే లేదు.. అది కెంపు మాత్రమే

తిరుమలలో పింక్​ డైమండ్​ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. స్వామివారికి అలంకారం చేసే పింక్​ డైమండ్​ పోయిందని గతంలో  కలకలం రేగింది.  అయితే అప్పట్లో  మైసూర్​ మహారాజ్​ సమర్పించింది డైమండ్​ కాదని కేవలం రూబీ.. కొన్ని కెంపులు  మాత్రమేనని ఏఎస్ఐ డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డి ఆధారాలతో తేల్చి చెప్పారు. 

గతంలో తిరుమల శ్రీవారికి  మైసూరు మహారాజు సమర్పించిన హారంలో డైమండ్‌ లేదని, రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్టు కొన్ని సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో రాజకీయ విమర్శలతో పింక్‌ డైమండ్‌ వ్యవహరం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. 

ప్రభుత్వానికి ... టీటీడీకి  ఇబ్బందులు కలిగేలా  అప్పట్లో వైసీపీ చేసిన ప్రచారం అసత్యమని తేల్చిచెప్పేలా కొన్ని ఆధారాలను ఆర్కియాలజీ డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డి బయటపెట్టారు.  తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్‌ డైమండ్‌ కాదని... అది కేవలం కెంపు మాత్రమేనని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్ఐ) స్పష్టం చేసింది. 

తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్‌ డైమండ్‌ను మాయం చేశారని..  2018లో అప్పటి  ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ అంశంపై ఏఎస్ఐ లోతుగా అధ్యయనం చేసింది. మైసూర్‌లోని ఏఎస్ఐ డైరెక్టర్‌(ఎపిగ్రఫీ) మునిరత్నం రెడ్డి ఆ వివరాలను  వెల్లడించారు. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది పింక్‌ డైమండ్‌ కానేకాదని ప్రకటించారు. 

1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్‌ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు. మైసూరు ప్యాలెస్‌ రికార్డుల ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని, పింక్‌ డైమండ్‌ ప్రస్తావన అందులో లేదని మునిరత్నం రెడ్డి స్పష్టం చేశారు.

అప్పట్లో  మహారాజ పర్యటనకు సంబంధించి మైసూరు ప్యాలెస్‌ నుంచి 1944 డిసెంబరు 29వ తేదీన రామయ్య అనే ప్యాలెస్‌ అధికారి టీటీడీ కమిషనర్‌కు లేఖ రాశారు. రైలు ద్వారా 1945 జనవరి 9న ఉదయం 8 గంటలకు రేణిగుంటకు చేరుకున్న తరువాత ..   మహారాజు తిరుపతి, శ్రీకాళహస్తి రాకపోకలకు రెండు మంచి కార్లను ఏర్పాటు చేసేందుకు సహకరించాలంటూ ఆ లేఖలో కోరారు. ఈ సందర్భంలోనే టూర్‌ షెడ్యూల్‌ కాపీని కూడా పంపారు.ఈ పర్యటనలోనే మైసూరు మహారాజు శ్రీవారికి హారాన్ని సమర్పించారు.ఆ హారాన్ని టీటీడీ కొన్నేళ్లుగా విశేష ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది.

2001 అక్టోబరు 21న జరిగిన గరుడసేవలో శ్రీ  మలయప్పస్వామికి ఈ హారాన్ని అలంకరించారు. అయితే వాహనసేవను వీక్షిస్తున్న భక్తులు విసిరిన నాణేలు తగలడంతో ఆ ఆభరణంలో కెంపు రాయి విరిగిపోయింది. ఆ విషయాన్ని తిరువాభరణం రిజిస్టర్‌లో కూడా నమోదు చేశారు.  మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో ఉన్నది కెంపు రాయి కాదని...  కోట్ల విలువైన పింక్‌ డైమండ్‌ అని...  ఆ డైమండ్‌ను అపహరించి జెనీవాలో జరిగిన వేలంలో విక్రయించారంటూ 2018లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే కైంకర్యాలు సరిగా జరగడం లేదని, నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు నిర్వహించారని కూడా ఆయన ఆరోపణలు చేసిన ఆరోపణలకు అప్పట్లో  టీటీడీ కూడా అదేస్థాయిలో స్పందించింది. 

రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ విషయంపై జగన్నాధరావు కమిటీ ఇచ్చిన నివేదికలో పగిలిన కెంపు ముక్కలు పేష్కార్‌ ఆధీనంలో ఉన్నాయని తెలియజేసినట్టు వివరణ ఇచ్చింది.ఆ కెంపు విలువ రూ.50లుగా నిర్ధారించినట్టు రికార్డులున్నాయంటూ రమణదీక్షితుల ఆరోపణలను కొట్టిపడేసింది. అయితే స్వామికి అనేక ఏళ్లనుంచి  కైంకర్యాలు నిర్వహించిన రమణదీక్షితులు చెప్పడంతో పలువురు భక్తులు సందేహంలో పడ్డారు.

భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు...  వైసీపీ అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డిపై రూ.200 కోట్ల పరువు నష్టం దావాను టీటీడీ వేసింది. దీనికి రూ.2 కోట్లు ఫీజు కూడా అప్పటి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆధ్వర్యంలోని అధికారుల బృందం చెల్లించింది. వైసీపీ అధికారం లోకి వచ్చాక ఆ కేసును ఉపసంహరించుకోవడంతో కోర్టుకు చెల్లించిన రూ.2 కోట్ల ఫీజు ఎవరిస్తారని, స్వామి నిధులు ఇలా దుబారా చేస్తారా అంటూ భారీగా విమర్శలొచ్చాయి. 

మైసూరు మహారాజు సమర్పించిన హారంలో పింక్‌ డైమండ్‌ అనేది లేదని పలు సాక్ష్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మైసూరులోని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌(ఎపిగ్రఫీ) మునిరత్నం రెడ్డి ఈ అంశంపై కొద్దిరోజుల పాటు పరిశోధన చేశారు.

 మైసూరు మహారాణి ప్రమోద దేవిని కలవడంతో పాటు ప్యాలెస్​లోని కొన్ని రికార్డులను పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఆ  హారాన్ని రూ.8,500కు ఢిల్లీలో తయారు చేయించినట్టు తేలింది. ప్యాలెస్​లోని ఆభరణాల రికార్డుల్లోనూ శ్రీవారికి సమర్పించిన హారంలో ఎలాంటి డైమండ్‌ ఉన్నట్టు లేదు. దీంతో గతంలో చేసిన విమర్శలు తాజా ఆధారాలతో అవాస్తవాలుగా తేలాయి. ఈ అంశంపై మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ.. .స్వామివారి విషయాల్లో లేనిపోని అభాండాలు వేయకూడదు. తప్పుడు ప్రచారాలు చేస్తే మూల్యం చెల్లించాల్సిందే. మా పరిశోధనలో రాజు సమర్పించిన హారంలో డైమండ్‌ లేదని తేలింది. దేవాలయాల విషయాల్లో రాజకీయాలు చేయడం సరికాదు అని అభిప్రాయపడ్డారు