తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తున్నది. ఈ ఏడాది ఏడు నెలల్లో శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. తిరుమలేశుడి హుండీ కానుకలతో కొండ ఖజానా నిండుతోంది. ఇప్పటికే 17 వేల కోట్ల రూపాయిల డిపాజిట్లు, 11 టన్నుల బంగారం .. బ్యాంకుల్లో వెంకన్న నిధి భద్రంగా ఉండగా నెల నెలా పెరుగుతున్న హుండీ ఆదాయం శ్రీనివాసుడిని మరింత సంపన్నుడ్ని చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు.. ఏడు నెలల్లో తిరుమల హుండీ ఆదాయం కి రూ. 827 కోట్ల రూపాయిలకు పైగా వచ్చాయి. ప్రతినెల 120 కోట్ల రూపాయిల మార్క్ ను రీచ్ అవుతున్న శ్రీవారి హుండీ ఆదాయం వెంకన్నను మరింత రిచెస్ట్ గార్డ్ ను చేస్తోంది. . జూలై నెలలో రికార్డు స్థాయిలో 129.3 కోట్ల రూపాయిల కానుకలు శ్రీవారి హుండీకి చేరాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు..వెలకట్టలేని ఆభరణాలు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న అలంకార ప్రియుడు. ఆపదమొక్కుల స్వామికి సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా పరమ భక్తుడే. భక్తులు మొక్కులో భాగంగా సమర్పించే కానుకలు ఇప్పుడు వెంకన్న హుండీని నింపేస్తున్నాయికోరుకున్న కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కలియుగ దైవం కొండపై కటాక్షిస్తుండటం తో రికార్డ్ స్థాయిలో హుండీ కానుకలు టీటీడీ ఆదాయాన్ని పెంచేస్తున్నాయి.
జూలై నెలలో 23.23 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా జూలై 10, 17, 24, 31 (సోమవారాల్లో) తేదీల్లో శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయిలకు పైగానే ఉంది. ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు హుండీ ని కానుకలతో నింపేస్తుండగా ఈ 7 నెలల్లోనే శ్రీవారి హుండీ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. జనవరి 2న తిరుమల పరకామణిలో శ్రీవారి హుండీ లెక్కింపు సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా జనవరి 2 హుండీ కానుకలు మొత్తం రూ. 7 కోట్ల 68 లక్షల 20 వేల రూపాయిలు గా తేల్చింది. ఈ లెక్కన సరికొత్త రికార్డుగా వెంకన్న హుండీ ఆదాయం నమోదైంది.