
- టీజేఎస్ చీఫ్ కోదండరాం
ఏటూరునాగారం, వెలుగు: ‘‘కేసీఆర్.. నీ ఫామ్ హౌస్ లో గుంట భూమి కూడా అడుగుతలేం. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు నువ్వు ఇస్తానన్న పట్టాలే అడుగుతున్నం. పోడు భూములకు పట్టాలిచ్చేదాకా పోరాటం ఆగదు” అని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ‘‘పోడు భూముల పోలి కేక’’ అఖిల పక్ష సదస్సు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. కోదండరాం, మాజీ ఎంపీ మిడియం బాబూరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం వచ్చాక పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకొని మరీ పరిష్కరిస్తానన్న సీఎం.. కనీసం దాని గురించి మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5న చేపట్టనున్న రాస్తారోకోను విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ కు ఓట్లు, సీట్లు తప్ప.. ప్రజల గురించి ఆలోచనే ఉండదని విమర్శించారు.