మేడిగడ్డ నిర్మాణం సరిగ్గా జరగలే : ప్రొఫెసర్​ కోదండరాం

మేడిగడ్డ నిర్మాణం సరిగ్గా జరగలే : ప్రొఫెసర్​ కోదండరాం
  •      ప్రాజెక్టు రీడిజైన్​లో గత సర్కారు నిర్లక్ష్యం చేసింది: ప్రొఫెసర్​ కోదండరాం
  •     ఎంక్వైరీ కమిషన్​కు ఇప్పటికే రెండుసార్లు ఆధారాలు అందజేశాం
  •     బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​

హైదరాబాద్ , వెలుగు : మేడిగడ్డ పై లోతుగా విశ్లేషణ చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా పనులు చేపట్టిందని, నిర్మాణం, రీడిజైన్ లో నిర్లక్ష్యం వహించిందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. బ్యారేజీ నిర్మాణానికి, డిజైన్​కు పొంతన లేదని, హడావుడిగా పనులు చేస్తే ప్రమాదం అని  మేధావులు హెచ్చరించినా గత సర్కారు పట్టించుకోలేదని అన్నారు. బుధవారం నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్ లో కోదండరాం మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదన్నా.. గత సర్కారు బ్యారేజీని నిర్మించిందని తెలిపారు.

ఆర్థికపరమైన అంశాల్లో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టు కాగ్ రిపోర్ట్​లో వెల్లడించారని చెప్పారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరో రకంగా చేయడంతో కుంగిపోయిందని తెలిపారు. ఇష్టానుసారంగా రీడిజైన్ చేయడంవల్లే ఇలా జరిగిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  

జ్యుడీషియల్​ కమిషన్​కే విచారణార్హత లేదనడం శోచనీయం

జ్యుడీషియల్​కమిషన్​కే విచారణార్హత లేదని కేసీఆర్ అనడం శోచనీయమని కోదండరాం మండిపడ్డారు. విచారణ కమిటీని రద్దు చేయించి, వాస్తవాలు బయటకు రాకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. దీనికన్నా అప్రజాస్వామికమైన చర్య మరొకటి ఉండదని పేర్కొన్నారు.  ఇరిగేషన్, కరెంట్ అవకతవకలపై కమిషన్ వేయాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీలో బీఆర్ఎస్ స్వయంగా చెప్పిందని కోదండరాం గుర్తు చేశారు. కాళేశ్వరం లో జరిగిన అవినీతి అక్రమాల గురించి జస్టిస్ ఘోష్ కమిషన్ కు తాను రెండు సార్లు ఆధారాలు సమర్పించానని చెప్పారు.

 తుమ్మిడిహెట్టిని పరిశీలనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని,  కమిషన్ ను కోరామని అన్నారు. గనుల వేలం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని తెలిపారు. సింగరేణికి గనులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్​ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల పై విచారణ చేసేందుకు జ్యుడీషియల్​ కమిషన్ కే అర్హత లేదని కేసీఆర్ అంటున్నారని టీజేఎస్ నేత పీఎల్ విశ్వేశ్వరరావు అన్నారు. మరి విచారణకు ఎవరికి అర్హత ఉందో కేసీఆరే చెప్పాలని చురకలంటించారు.ఈ సమావేశంలో ఆశప్ప, బైరి రమేశ్​, నిజ్జన రమేశ్, తదితరులు పాల్గొన్నారు.