కేసీఆర్​ అవినీతిని దేశవ్యాప్తంగా ఎండగడ్తం

కేసీఆర్​ అవినీతిని దేశవ్యాప్తంగా ఎండగడ్తం
  •   లిక్కర్ వ్యాపారంతో కవితకు ఏం పని?
  •     కృష్ణా జలాల సాధన కోసం 10న నిరసన దీక్ష
  •     ధరణి సమస్యలపై 20న సదస్సు 
  •     విభజన హామీలపై ఢిల్లీలో 30న సెమినార్​, 31న ఆందోళనలు

    
హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​.. తెలంగాణ పార్టీ కాదని, తెలంగాణతో ఉన్న సంబంధాన్ని తెగదెంపులు చేసుకుందని టీజేఎస్​ అధ్యక్షుడు  కోదండరాం అన్నారు. ‘‘త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రంలో.. ఆ త్యాగాల కారణంగా ఎదిగిన పార్టీ ఇయ్యాల ‘తెలంగాణ’ అనే పేరును వదులుకుంది. ఇక బీఆర్ఎస్ మన పార్టీ కాదు. ఇంకా కూడా రాష్ట్ర ప్రజలకు భ్రమలు అవసరం లేదు. తెలంగాణ రక్షణ కోసం తెలంగాణవాదులు ఏకం కావాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాలు తప్పితే ప్రజల బాధలు పట్టడం లేదని, సొంత అస్తిత్వం కోసం తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎనిమిదిన్నరేండ్లలో కేసీఆర్​ సర్కార్​ అడ్డగోలుగా రాష్ట్ర సంపదను దోచుకుందని.. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. హైదరాబాద్​లోని టీజేఎస్ స్టేట్ ఆఫీసులో బుధవారం మీడియాతో కోదండరాం మాట్లాడారు. 

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తే అరెస్టులు చేయించే కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయి ఎటుపోవాలో అర్థంకాక కొట్టుమిట్టాడుతున్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ అవినీతిని ఎండగడుతామని చెప్పారు. లిక్కర్ వ్యాపారంతో కేసీఆర్ కూతురు కవితకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు. గ్రామ జ్యోతి పథకం ఏమైందో తెల్వదని, గ్రామ పంచాయతీల నిధులను కూడా రాష్ట్ర సర్కార్ కొల్లగొట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో నయా జాగీర్దారీ వ్యవస్థను చూస్తున్నామని, ఇష్టానుసారంగా భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. పోడు భూముల రైతులకు వెంటనే న్యాయం చేయాలని, అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని, కౌలు రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 
చెమట చుక్క కార్చేవారే మా అభ్యర్థి

‘‘సెంటు చుక్క వాసన వచ్చే వాడు కాదు.. చెమట చుక్క కార్చేవారే మా అభ్యర్థి. రాష్ట్ర ఉద్యమకారులమంతా సమావేశమైనం. అందరం ఏకమై తెలంగాణవాదాన్ని రక్షించుకోవాలని నిర్ణయించుకున్నం. 119 అసెంబ్లీ స్థానాలే మా లక్ష్యం.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తం” అని కోదండరాం ప్రకటించారు. త్యాగాల పునాదిపై ఏర్పడ్డ పార్టీ  ‘తెలంగాణ’ అనే పదాన్ని తొలగించుకొని బీఆర్​ఎస్​గా మారిందని, తద్వారా ఉద్యమ అమరులను, తెలంగాణ వాదాన్ని అవహేళన చేసిందని దుయ్యబట్టారు. 

ప్రజా సమస్యలపై వరుస ఆందోళనలుకృష్ణా జలాల సాధన కోసం ఈ నెల 10న నిరసన దీక్ష చేస్తామని కోదండరాం ప్రకటించారు. ధరణి పోర్టల్ సమస్యలపై ఈ నెల 20న సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. విభజన హామీలపై జనవరి 30న ఢిల్లీలో సెమినార్, 31న ఆందోళన కార్యక్రమం చేపడుతామని కోదండరాం ప్రకటించారు. విభజన హామీల అమలు చేయాలని  కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేశ్​, నిజ్జన రమేశ్, మరబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.