పట్టపగలు కార్యాలయంలోనే దారుణ హత్యకు గురైన అబ్దుల్లాపూర్ మెంట్ తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ఉదయం 11 గంటలకు నాగోల్ లో జరగనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం తర్వాత రాత్రి ఆమె మృతదేహాన్ని ఎల్బీనగర్ లోని ఇంటికి తీసుకువచ్చారు. విజయారెడ్డికి నివాళి అర్పించేందుకు రాజకీయ నాయకులు, ఉద్యోగులు భారీగా వస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రెవిన్యూ ఉద్యోగులు తరలివస్తున్నారు. దారుణ ఘటనను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. డ్యూటీలో ఉన్న మహిళా తహసీల్దార్ ను సజీవ దహనం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయారెడ్డికి నివాళి అర్పించేందుకు రాజకీయ నేతలు వస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెబుతున్నారు. హంతకుడిని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.
మహిళా తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. విజయారెడ్డి హత్యపై అన్ని వర్గాల నుంచి నిరసన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు రెవెన్యూ సంఘాలు పిలుపిచ్చాయి. మూడు రోజుల పాటు విధులకు దూరంగా ఉండనున్నారు. విజయారెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు రెవిన్యూ ఉద్యోగులంతా హైదరాబాద్ వస్తున్నారు. హంతకుడి వెనుక ఉన్న అసలు కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని తహసీల్దార్, రెవిన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాయి.