‘ఫెమా’ ఉల్లంఘనల కేసులో మంచిరెడ్డి విచారణ

‘ఫెమా’ ఉల్లంఘనల కేసులో మంచిరెడ్డి  విచారణ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇవాళ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మరోసారి ఆయనను ప్రశ్నిస్తున్నారు. నిన్న కూడా ఆయన్ని ఈడీ అధికారులు 9 గంటల పాటు విచారించారు. ఫారిన్ మనీ ట్రాన్సాక్షన్స్ గురించి ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. 2014 ఆగస్టులో మంచిరెడ్డి కిషన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటించారు. విదేశాలకు వెళ్లే ముందు ఫారెక్స్ కార్డ్ కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. డబ్బులు అవసరం కావడంతో అమెరికాలోని తన బంధువుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. విదేశాల నుంచి జరిగిన ట్రాన్స్ ఫర్స్  ఇండియాలోని మంచిరెడ్డికి చెందిన అకౌంట్స్ తో లింక్ అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. 

ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద 2015లో రిజిస్టరైన కేసుల్లో వివరాలను ఈడీ రాబడుతోంది. ఇందులో భాగంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని విచారిస్తోంది. విదేశీ టూర్స్ , పెట్టుబడులు, ఫారిన్ మనీ ట్రాన్సాక్షన్స్  గురించి నిన్న ప్రశ్నించినట్లు తెలిసింది. ఫారిన్ టూర్స్ లో జరిగి ట్రాన్సాక్షన్స్ లెక్కలపై ఆరా తీశారు. ప్రతి స్టేట్ మెంట్ పై ఆయన సంతకాలు తీసుకున్నారు. ఫెమా కేసులో 2018లో ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులకు మంచిరెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. పూర్తి సమాచారం కోసం ఆయన్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.