- సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల పీఆర్సీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ పీఆర్సీలపై చర్చించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్లో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, భూముల మార్కెట్ వ్యాల్యూ సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ ఫిట్మెంట్పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డీఏలు, ఉద్యోగులకు క్యాష్లెస్ స్కీమ్ అమలు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత పెట్టి.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ బకాయిలపైనా చర్చించనున్నారు. గోదావరి పుష్కరాలు, జనగణన, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి, ఎల్లంపల్లికి నీటిని తరలించే మార్గాల ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది.
ఇప్పటికే సనత్నగర్ టిమ్స్ ట్రయల్ రన్ మొదలుపెట్టారు. పూర్తిస్థాయిలో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్వహణపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం, జూన్2న రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాటు సందర్భంగా కొత్త ఆసరా పింఛన్ల మంజూరు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీపై కేబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది. ఉద్యమకారుల సంక్షేమం కోసం కేకే, కోదండరాం కమిటీల సిఫార్సుల విధివిధానాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. సాగునీటి రంగానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ, సాంకేతిక మార్పులపై కేబినెట్ చర్చించనుంది.
