అలనాటి అందాల తారల కలయికే.. “కిట్టి పార్టీ”

అలనాటి అందాల తారల కలయికే.. “కిట్టి పార్టీ”

హైదరాబాద్ : పెళ్లి సందడి, మైనే ప్యార్ కియా, రోజా లాంటి సినిమాలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఈ మూవీలోని హీరోయిన్లు అందరూ కలిసి సందడి చేశారు. ఆచార్య క్రియేషన్స్‌, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్‌ పవన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్‌ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్‌ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్‌ దీప్తీ భట్నాగర్‌, సదా, సుమన్‌ రంగనాథ్‌, హరితేజ, హర్షవర్ధన్‌ రాణే, పూజా జవేరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై అలనాటి అందాల తారల కలయికతో కలర్ ఫుల్ గా కనిపించింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ సుందర్‌ పవన్‌ మాట్లాడుతూ ‘ఇదొక ఫీమేల్‌ బడ్డీ డ్రామా. అలాగని, ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా అని చెప్పను. కానీ, సినిమాలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఇది. ఏ పరభాషా సినిమాకూ రీమేక్‌ కాదు. వేరే సినిమా స్ఫూర్తితో తీయడం లేదు. ఆరుగురు మహిళలు చుట్టూ కథ తిరుగుతుంది. భాగ్య శ్రీ, దీప్తీ భట్నాగర్‌, సుమన్‌ రంగనాథ్‌, మధుబాల, సదా, హరితేజ, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో మరిన్ని సినిమా వివరాలు వెల్లడిస్తాం’ అన్నారు.