150 రోజుల పాటు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర

150 రోజుల పాటు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర

ప్రాంతీయ పార్టీలను పడగొట్టడానికి బీజేపీ 6వేల కోట్లు ఖర్చు చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఈ సంపదంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కూడా అవినీతి పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలను రాహుల్ తన పాదయాత్రలో లేవనెత్తుతారని తెలిపారు. 

అన్ని రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ సెక్రటరీలతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ సమావేశమై భారత్ జొడో యాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..దేశాన్ని ఏకం చేయడానికి.. ప్రభుత్వాలను ప్రశ్నించడానికి..ప్రజాసమస్యలను తీర్చడానికి రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. 150 రోజులపాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన

సెప్టెంబర్ 4న ఢిల్లీలో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, అవినీతి డబ్బులతో ప్రభుత్వాలను కూలదోసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు.