దేవుళ్లు ప్రగతిభవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు

దేవుళ్లు ప్రగతిభవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు

‘కరోనా సమయంలో స్టాఫ్ నర్సులను దేవుళ్లని మీరే పొగిడారు... ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. స్టాఫ్ నర్సులను ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తొలగించి 1600 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తమను ఉన్నఫలంగా ఉద్యోగాల నుంచి తొలగించారని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ స్టాఫ్ నర్సుల బృందం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి వినతీపత్రం ఇచ్చింది. స్పందించిన రేవంత్.. తక్షణం వారందరిని తిరిగి ఉద్యోగాలలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 
‘ప్రగతిభవన్‌కు వస్తే ఐదు నిముషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా? ప్రగతిభవన్ అనేది ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా? 2018లో ఎంపికైన ఏఎన్ఎంలకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదు? 50 వేల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన ప్రకటన చీటింగ్ ‘వన్స్ మోర్’ లాగా ఉంది. ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ నివేదిక ఇస్తే.. మీరు 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏంటి? ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ గురించి స్పష్టం చేయండి. స్టాఫ్ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలి. 2018 ఏఎన్ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలి. ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్లలోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలి. ఉద్యోగ భర్తీకి షెడ్యూల్ ప్రకటించకపోతే అతి త్వరలో నిరుద్యోగ యువత తరఫున టీపీసీసీ కార్యచరణ ఉంటుంది’ అని ఆయన హెచ్చరించారు.