కాంగ్రెస్ లోకి పొంగులేటి వస్తే ఆహ్వానిస్తాం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ లోకి పొంగులేటి వస్తే ఆహ్వానిస్తాం: రేవంత్ రెడ్డి

మహబూబాబాద్ జిల్లా : 2024 జనవరి మొదటి వారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం పోడు భూములు సమస్య పరిష్కరం కోసమే ఉంటుందన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధాంతం మంచిదేనన్న రేవంత్.. ఆయన కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్న రేవంత్..తాను కేసులుకు భయపడనని, తనకు కేసులు కొత్తేమీ కాదన్నారు. 

‘కేసీఆర్ భూతం లాంటివాడు. పట్టి సీసాలో బంధించాలి. లేకపోతే తట్టుకోలేం. కేసీఆర్ వ్యతిరేక శక్తులందరూ కలిసి కాంగ్రెస్ కు సపోర్టు చేయాలి’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరవీరుల కుటుంబాలకు అనుమతి లేని ప్రగతిభవన్ ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకే మంత్రివర్గంలో 90 శాతం పదవులు ఇచ్చారని ఆరోపించారు. కోవర్టు ఆపరేషన్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిట్టా అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. అధికార పార్టీలో చేరిన12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు, 60 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేసి, ప్రజలను తాగుబోతులుగా చేశారంటూ ముఖ్యమంత్రిపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకూ రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పులపాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.