టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ హౌజ్ అరెస్టు అనంతరం.. పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటికి వచ్చి అడ్డుకోవడం ఏంటీ అని ప్రశ్నించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తిరగొద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ కు వెళ్తున్నట్లు చెప్పానా అని పోలీసులను నిలదీశారు. నిరసన తెలపడానికి కూడా హక్కు లేదా అని అడిగారు.
తాను ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా అనుమతి కావాలా అని రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపైనా ఆయన పోలీసులు ఏకిపారేశారు. ఆమెను ఎక్కడ్నుంచైతే తీసుకెళ్లారో అక్కడికి తీసుకురండి అని డిమాండ్ చేశారు. సర్పంచులకు తెలియకుండా రూ.35వేల కోట్లు దారి మళ్లించారన్న రేవంత్ రెడ్డి... 8ఏళ్లు పూర్తయినా అమరవీరుల స్థూపం పూర్తి కాలేదని ఆరోపించారు. అసలు తనను ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన్ను పోలీసులు బలవంతంగా పోలీసుల జీపులోకి ఎక్కించుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
బొల్లారం పీఎస్ ముందు కాంగ్రెస్ ఆందోళన
సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పీఎస్ కి తరలించారు. దీంతో బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీఎం డాండాం అంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా గృహనిర్బంధాలు చేస్తూ అరెస్టులు చేయడం దారుణమని మండిపడ్డారు. వెంటనే రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచుల నిధుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు మాతో దురుసుగా ప్రవర్తించిన్రు: విజయారెడ్డి
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లో తమతో సీఐ అసభ్యంగా మాట్లాడారని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆరోపించారు. బంజారాహిల్స్ సీఐ కార్పొరేటర్ గా తన పట్లనే ఇలా దురుసుగా ప్రవర్తిస్తే.. సామాన్య మహిళలు పోలీస్ స్టేషన్ కు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బంజారాహిల్స్ పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని, వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళితే తమను అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎందుకు అరెస్టు చేశారని అడిగితే పోలీసుల నుంచి సరైన సమాధానం రాలేదన్నారు.
రేవంత్ హౌస్ అరెస్ట్
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగా పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకుల ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. వారిని గృహ నిర్బంధం చేశారు. అంతేకాదు.. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
సర్పంచ్ ల ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం, ముందస్తు అరెస్టులకు నిరసనగా జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తు నిరసనలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి నిరాకరించినా ధర్నా చేస్తామని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీపీసీసీ ఇప్పటికే హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ డీసీసీ ప్రెసిడెంట్స్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఖైరతాబాద్ కార్పొరేటర్ అరెస్ట్
రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రంగారెడ్డి జిల్లా : మైలర్ దేవ్ పల్లిలో ముందస్తుగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నుంచి కాంగ్రెస్ పార్టీ మైలార్ దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ధనంజయతో పాటు సీనియర్ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
కరీంనగర్ జిల్లా : వీణవంక మండలంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.