- మహబూబాబాద్ మార్కెట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని పలువురు రైతులకు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి పరారవడంతో ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరిలో రైతులు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు తాము పండించిన మిర్చి తీసుకువచ్చారు. మార్కెట్లో ప్రభుత్వ ట్రేడ్ లైసెన్స్ కలిగిన వ్యాపారి ధరావత్ శేఖర్ కురూ.23లక్షల విలువైన మిర్చిని అమ్మారు.
నెలలు గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు పలుమార్లు అతడిని నిలదీశారు. ఇటీవల సదరు వ్యాపారి రూ. కోటికి పైగా అప్పులు చేసి కోర్టు ద్వారా ఐపీ పెట్టినట్లు తెలుసుకున్న రైతులు మంగళవారం మార్కెట్ గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు.
అదే సమయంలో గూడూరు మండలం ఎర్రగుంట తండాకు చెందిన మూడు హోలీ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని టౌన్ ఎస్సై గడ్డం ఉమ, పోలీసులు అడ్డుకొని నీళ్లు చల్లారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. మార్కెట్ అధికారులు, పోలీసుల ద్వారా డబ్బులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
