
- వ్యాపార సముదాయాలపై చర్యల్లేవ్
- గోదాములు సిటీ బయటకు తరలించట్లే
- సమ్మర్ కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో ఫైర్ సేఫ్టీని వ్యాపారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతేడాది సిటీలో జరిగిన వరుస అగ్ని ప్రమాదాల తర్వాత జీహెచ్ఎంసీ ప్రచారం చేసినా వ్యాపారస్తుల నుంచి స్పందన కనిపించడం లేదు. ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రొగ్రాంలు నిర్వహించినా ఫైర్ సేఫ్టీ కిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. గ్రేటర్ 6 లక్షల మంది వ్యాపారులు ఫైర్ సేఫ్టీ ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పినప్పటికీ పెడచెవిన పెడుతున్నారు.
గ్రేటర్లో వ్యాపారాలు జరుగుతున్న ప్రాంతాలను నాలుగు కేటగిరీల కింద విభజించారు. ఇందులో ఇండివిజువల్ షాపులు ఉన్న వారు మొదటి కేటగిరీలో ఉన్నారు. వీరు రెండు స్మోక్ డిటెక్టర్లతో పాటు అగ్నిమాపక సిలిండర్లు రెండు అందుబాటులో ఉంచితే సరిపోతుంది. రెండో కేటగిరీలో గ్రూప్ ఆఫ్ బిజినెన్లు ఉన్నాయి. ఒకే బిల్డింగ్లో ఎక్కువ షాపులు ఉన్న వారు ఈ కేటగిరీలో ఉన్నారు.
ఇందులో అందరూ కలిపి కామన్గా ఫైర్ సేఫ్టీ సిస్టం అమర్చుకోవాల్సి. మూడో కేటగిరీలో బిల్డింగ్లోని సెల్లార్లు క్లియర్ చేయడం, ఫైర్ ఎగ్జిట్ తదితర వాటికి సంబంధించి ఉంది. నాలుగో కేటగిరీలో రెడ్ కేటగిరీ కింద గోదాంలు ఉన్నాయి. టింబర్ డిపోలు, వేస్ట్ పేపర్ గోదాములతో పాటు తదితర గోదాములు ఉన్నాయి. గోదాములను ఇండస్ర్టియల్ ఏరియాలకు షిఫ్ట్ చేయాలని సూచించారు. అయినప్పటికీ వాటిని తరలించడం లేదు. సమ్మర్ కావడంతో ఆయా గోదాముల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
వరుసగా అగ్ని ప్రమాదాలు
2022 మార్చి 23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జిలో గతేడాది సెప్టెంబర్ 12న జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది చనిపోయారు. గతేడాది జనవరి 19న సికింద్రాబాద్లోని డెక్కన్ మాల్లో జరిగిన ఫైర్
యాక్సిడెంట్లో ముగ్గురు మరణించారు.
మార్చి16న స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ఆరుగురు చనిపోయారు. ఏప్రిల్ 16న కుషాయిగూడలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. నవంబర్ 14న బజార్ ఘాట్లో 9 మంది మరణించారు. ఇవి కాకుండా నిత్యం ఎక్కడో చోట ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది మరణిస్తూనే ఉన్నారు.
హోల్ సేల్ మార్కెట్లలో గోదాములు
గ్రేటర్లో అనుమతులు లేకుండా రకరకాల బిజినెస్లు వేలాది మంది చేస్తున్నారు. ప్రధానంగా అనుమతులు తీసుకోకుండా అక్రమంగా గోదాములను ఏర్పాటు చేసుకున్నారు. బేగంబజార్, మదీనా, ఉస్మాన్ గంజ్, సీటీసీ, రాణిగంజ్ తదితర మార్కెట్లలో గోదాముల మాదిరిగానే మెటీరియల్ని స్టాక్ చేసి పెడుతున్నారు. కొన్ని గోదాములు రెసిడెన్షియల్ అనుమతులు పొంది అందులో ఇల్లీగల్గా గోదాములను ఏర్పాటు చేసుకుని మెట్లని వదలకుండా స్టాక్ పెడుతున్నారు.
ఆ గోదాముల్లో ఫైర్ సేఫ్టీ పాటించడం లేదు. ఒక్కో గోదాములో సెక్యూరిటీ కోసం పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న సేఫ్టీని పట్టించుకోవట్లేదు. సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్లో రెసిడెన్షియల్ పర్పస్లో కేవలం రెండు ఫ్లోర్లకు మాత్రమే జీహెచ్ఎంసీ వద్ద అనుమతి పొందారు. గ్రేటర్లో 10 వేల గోదాములు ఉంటాయని అన్నింటినీ తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. స్వప్నలోక్ అగ్ని ప్రమాదం తర్వాత గోదాములను పూర్తిగా ఇండస్ట్రీయల్ ప్రాంతాలకు తరలించాలని అధికారులు కొందరికి నోటీసులు ఇచ్చినా వాటిని తరలించడం లేదు.
సిబ్బంది కొరత కారణమే..
ఫైర్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకోకపోవడానికి డీఆర్ఎఫ్ వద్ద సిబ్బంది కొరత ఓ కారణం. డీఆర్ఎఫ్ వద్ద మొత్తం 450 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. గ్రేటర్ 30 డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. ఎక్కడ విపత్తు జరిగిన వీరే కంట్రోల్ చేయాల్సి వస్తుంది. దీంతో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోని వారిపై చర్యలు తీసుకునేందుకు సిబ్బంది సరిపోవడం లేదు. జోనల్, సర్కిల్ స్థాయిలో అధికారులు ఫైర్ సేఫ్టీకి సంబంధించి సహకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
కానీ వారికి ఎన్నో ఇతర పనులు ఉండటంతో ఫైర్ సేఫ్టీపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. దీంతో ఫైర్ సేఫ్టీ సిస్టంని ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రాని వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవడంలేదు. డీఆర్ఎఫ్ సిబ్బందిని పెంచితే కొద్ది నెలల్లోనే అంతట ఫైర్ సేఫ్టీ సిస్టం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎంతో ముఖ్యమైన ఈ డిపార్టుమెంట్లో సిబ్బందిని పెంచడం లేదు.