రైతుల ఆందోళనతో దిగొచ్చిన వ్యాపారులు

రైతుల ఆందోళనతో దిగొచ్చిన వ్యాపారులు

అచ్చంపేట, వెలుగు :  నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేటలో పల్లీ రైతుల ఆందోళనతో వ్యాపారులు దిగొచ్చారు. వేరుశనగ మద్దతు ధరను పెంచారు. వ్యాపారులు, మార్కెట్​సిబ్బంది కుమ్మక్కై వేరుశనగ ధరను ఇష్టానుసారంగా తగ్గిస్తున్నారంటూ రైతులు ఆదివారం అచ్చంపేట అంబేద్కర్​చౌరస్తాలో ధర్నాకు దిగడంతోపాటు మార్కెట్​ఆఫీసును ముట్టడించారు. చైర్​పర్సన్​అరుణపై పల్లీలు పోసి నిరసన తెలిపారు. సోమవారం కూడా నిరసనను కొనసాగించారు. ర్యాలీగా అంబేద్కర్​చౌరస్తా చేరుకుని, రాస్తారోకో చేపట్టారు. అనంతరం మార్కెట్​ఆఫీసు ముందు బైఠాయించి, మద్దతు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. స్పందించిన మార్కెటింగ్​శాఖ జేడీ ఇఫ్తకార్​అహ్మద్, ఏడీ బాలమణి, అచ్చంపేట డీఎస్పీ కృష్ణకిశోర్.. రైతులు, వ్యాపారులతో పలు దఫాలు చర్చలు జరిపారు. చివరికి ఇరువురిని ఒప్పించి మద్దతు ధరను పెంచారు.

ఆదివారం రూ.4 వేలు నుంచి రూ.4,999 మధ్య పలికిన క్వింటాల్​పల్లీకి రూ.200; రూ.5వేల నుంచి రూ.6,500 మధ్య ధర పలికిన పల్లీకి రూ.150; రూ.6,500 నుంచి రూ.7వేలు మధ్య ధర పలికిన పల్లీకి రూ.100 అదనంగా చెల్లించేందుకు వ్యాపారులు ఒప్పుకున్నారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించకపోతే వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. చర్చల్లో మార్కెట్​సెక్రటరీలు నర్సింహ, సరోజ, సీఐ రవీందర్, ఎస్సైలు రాము, లెనిన్, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.