హైదరాబాద్ లో అదే ముసురు.. అవే కష్టాలు... ఐటీ కారిడార్లో వాహనాల బారులు..

హైదరాబాద్ లో అదే ముసురు.. అవే కష్టాలు... ఐటీ కారిడార్లో వాహనాల బారులు..

మాదాపూర్, వెలుగు: నగరాన్ని ముసురు వీడడం లేదు. మూడు రోజులుగా అలాగే పడుతుండడంతో నగరంలో వాహనాల వేగం మందగించింది. హైటెక్​సిటీ వైపు వచ్చే అన్నీ రోడ్లపై గురువారం వాహనాలు బారులు తీరి కనిపించాయి. ముసురుతో రోజూ బైక్​లపై వచ్చేవారు కార్లను వాడుతుండటంతో రద్దీ పెరుగుతోంది. గురువారం ఉదయం నానక్​రామ్​గూడ, ఔటర్​రింగ్​రోడ్డు నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే రోడ్డు వాహనాలతో నిండిపోయింది. 

జేఎన్​టీయూ నుంచి సైబర్ టవర్స్ రూట్, బయోడైవర్సిటీ నుంచి ఐకియా జంక్షన్​మీదుగా సైబర్​టవర్స్​రూట్, షేక్​పేట్ నుంచి ఖాజాగూడ రూట్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి రూట్​లో ట్రాఫిక్​జామయ్యింది. వరుసగా ముసురు నేపథ్యంలో సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు ఐటీ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్​లేదా మధ్యాహ్నం 2 గంటల నుంచే ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. 

ఫ్లోటింగ్​ కెమెరాతో గాలింపు 

నాలాలో పడిపోయిన హఫీజ్​పేట్​ప్రేమ్​నగర్​ బి బ్లాక్​కు చెందిన బాలయ్య(70) కోసం మంగళవారం రాత్రి నుంచి గాలిస్తున్నా జాడ దొరకలేదు. హెచ్ఎండబ్ల్యూఎస్​ఆఫీసర్లు చెన్నై నుంచి ప్రత్యేకంగా ఫ్లోటింగ్ కెమెరా తెప్పించి వెతుకుతున్నారు. 

నాలాలో చెత్తను తొలగించి మరీ వెతుకుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. 48 గంటలు గడుస్తున్నా బాలయ్య ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు అక్కడే రోదిస్తూ ఉన్నారు. 

కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు

హైదరాబాద్​ సిటీ : వరుసగా ముసురు పడుతుండడంతో నగరవాసులు ట్రాఫిక్ భయంతో మెట్రో కే ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే సమయం, వచ్చే టైం లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో మెట్రోలో వెళ్లేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో సిటీలోని ఇంటర్​ఛేంజ్​ స్టేషన్​అయిన అమీర్ పేట్ గురువారం కిక్కిరిసిపోయింది.