స్పెషల్ బ్యాచ్​కి సెలెక్ట్ చేయలేదని నీట్ స్టూడెంట్ ఆత్మహత్య

స్పెషల్ బ్యాచ్​కి సెలెక్ట్ చేయలేదని నీట్ స్టూడెంట్ ఆత్మహత్య

చెన్నై: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) స్పెషల్ కోచింగ్ బ్యాచ్​కు తనను సెలెక్ట్ చేయలేదని 18 ఏండ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. రైలు కింద పడి ప్రాణం తీసుకుంది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అబతరణపురానికి చెందిన నిషా.. నీట్​కోసం నైవేలిలోని బైజుస్ కోచింగ్ సెంటర్​లో జాయిన్ అయింది. ఎప్పటిలాగే క్లాస్​కు వెళ్తున్నానని ఇంట్లోవాళ్లకు చెప్పి బయల్దేరిన ఆ యువతిని.. కోచింగ్ సెంటర్​ వాళ్లు స్పెషల్ బ్యాచ్​లో కూర్చునేందుకు అనుమతివ్వలేదు. దీంతో మనస్థాపం చెందిన నిషా.. వడలూరు స్టేషన్​కు చేరుకుని రైలు కింద దూకింది. ఆమెను గమనించి లోకో పైలట్ రైలును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. రైల్వే పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టానికి తరలించారు.

బైజుస్ కోచింగ్ సెంటరే కారణం: నిషా తండ్రి

తన కూతురి ఆత్మహత్యకు బైజుస్ కోచింగ్ సెంటరే కారణమని నిషా తండ్రి ఉతిరభారతి ఆరోపించారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా స్టూడెంట్లను బ్యాచ్​లుగా వేరు చేయడంతో నిషా మనస్థాపం చెందిందని తెలిపారు. ‘‘నిషాకు 399 మార్కులు వచ్చాయి. కానీ, 400 కంటే ఎక్కువ మార్కులు వచ్చినోళ్లకు మాత్రమే బైజుస్ వాళ్లు స్పెషల్ కోచింగ్​ ఇస్తున్నారు. ఇదే ఆమె డిప్రెషన్​కు కారణమైంది” అని ఉతిర భారతి చెప్పారు. కోచింగ్ సెంటర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.