పెళ్లైన నెల రోజులకే దారుణం.. భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం

పెళ్లైన నెల రోజులకే దారుణం.. భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్​లో దారుణం జరిగింది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చంపాపేటలోని ఎస్ఆర్ కాలనీలో స్వప్న అనే యువతి గత ఎనిమిది నెలల నుంచి రూమ్ అద్దెకు తీసుకుని ఉంటోంది. తాను ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు స్వప్న తమ ఇంటి యజమానికి చెప్పింది. తనకు నెల రోజుల క్రితం ప్రేమకుమార్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిందని కూడా వివరించింది. ఇదిలా ఉంటే.. శనివారం (అక్టోబర్ 28వ తేదీన) ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో మహేశ్వరానికి చెందిన ప్రేమకుమార్ (24) స్వప్నను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.

ఆ తర్వాత తాను బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్ద శబ్ధం రావడంతో ఇంటి యజమాని బయటకు వెళ్లి చూడగా ప్రేమ్ కుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అదే సమయంలో ఇద్దరు యువకులు బిల్డింగ్ పై నుంచి మెట్లు దిగి హడావిడిగా కిందకు వెళ్లిపోవడాన్ని ఇంటి యజయాని గమనించాడు. 

వెంటనే ఇంటి యజమాని ఐఎస్ సదన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి లోపలికి వెళ్లి చూశారు. స్వప్న రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. ప్రస్తుతం ప్రేమ్ కుమార్ పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తోంది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఐఎస్ సదన్ పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్వప్నను ప్రేమ్​కుమార్ చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అసలు ఈ ఇద్దరు భార్య భర్తలేనా..? ప్రేమ్​కుమార్ పై నుంచి కిందకు దూకిన సమయంలో పారిపోయిన ఆ ఇద్దరు యువకులు ఎవరు..? అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును చేధించడం పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది.