- మరో ముగ్గురినీ చంపేసిన పెండ్లి కొడుకు సోదరుడు
- ఆపై పిస్టల్తో కాల్చుకుని సూసైడ్.. యూపీలో పెండ్లింట విషాదం
మెయిన్పురి: ఉత్తరప్రదేశ్లో పెండ్లింట దారుణం చోటుచేసుకుంది. పెళ్లి అయిన మర్నాడే కొత్త జంట తో సహా ఐదుగురిని పెండ్లి కొడుకు అన్న గొడ్డలితో నరికి చంపాడు. ఆపై పిస్టల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలోని మెయిన్పురి జిల్లా అర్సర గోకుల్పూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుభాష్ యాదవ్ చిన్న కొడుకు సోను యాదవ్(23) పెండ్లి గురువారం సోని(20)తో జరిగింది.
శుక్రవారం రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రపోయాకా, అర్ధరాత్రి సుభాష్ పెద్ద కుమారుడు శివ్వీర్ యాదవ్(28) లేచి డాబాపై నిద్రిస్తున్న కొత్త జంటను గొడ్డలితో నరికాడు. తర్వాత మరో గదిలో నిద్రపోతున్న ఇంకో తమ్ముడు భుల్లన్ యాదవ్, బావ సౌరభ్, ఫ్యామిలీ ఫ్రెండ్ దీపక్(20)ను చంపేశాడు. ఆ తర్వాత తన భార్య, అత్తపైనా దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో ఇంట్లో నిద్రిస్తున్న వారంతా లేచి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పిస్టల్తో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు స్పాట్కు చేరుకొని గాయపడినవారిని జిల్లా హాస్పిటల్కు తరలించారు. అయితే, నిందితుడు ఇంతమందిని ఎందుకు చంపాడో తెలియలేదని, ఎంక్వైరీ జరుగుతోందని మెయిన్పురి ఎస్పీ తెలిపారు.