- దేశంలో విధ్వంసాలకు పీఎఫ్ఐ కుట్ర
- కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థలపై దాడులు చేసేలా ట్రైనింగ్
- నిందుతుల రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఐఏ వెల్లడి
- నివేదిక కోర్టుకు అందజేత
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కుట్ర పన్నినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) గుర్తించింది. పీఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నాయని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. ఈ మేరకు నిందితుల రిమాండ్ రిపోర్ట్ను కోర్టుకు అందజేసింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారన్న సమాచారంతో ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ అధికారులు ఇటీవలే సోదాలు చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్లో 28, హైదరాబాద్లో నాలుగు సహా మొత్తం 40 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు.
ఈ సోదాల్లో నిజామాబాద్ కు చెందిన ప్రధాన నిందితుడు అబ్దుల్ ఖాదిర్ (28), నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన సయ్యద్ సమీర్ (21),ఆదిలాబాద్కుచెందిన ఫిరోజ్ ఖాన్ (22), మేడ్చల్ జిల్లా షామీర్పేట్ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన మొహమ్మద్ ఉస్మాన్ (34), కరీంనగర్ హుస్సేన్పురకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ (33) ను అరెస్ట్ చేసి నాంపల్లి ఎన్ఐఏ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థపైనా దాడులకు పీఎఫ్ఐ కుట్రపన్నినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇందుకోసం పీఎఫ్ఐ ఫండ్స్పేరుతో ప్రధాన నిందితుడు అబ్దుల్ ఖాదిర్ డబ్బు సేకరించాడని ఆఫీసర్లు ఆ రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పీఎఫ్ఐ కార్యకర్తలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చి, ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని కత్తులు, ఐరన్ రాడ్లతో ఎలా దాడి చేయాలో శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. ఉద్వేగపూరితమైన స్పీచ్లు, వీడియోలతో ఒక వర్గంపై కక్ష పెంచుకునేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. పీఎఫ్ఐ కేసులో జులై 4న ఖాదిర్ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మత కల్లోలాలు, దాడులకు కుట్ర చేస్తున్నాడన్న సమాచారంతో ఆగస్ట్ 25న ఖాదిర్ పై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అనంతరం అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించింది.