సీఎం కేసీఆర్​ డైలాగ్​.. సీఎండీ నోటి వెంట

సీఎం కేసీఆర్​ డైలాగ్​.. సీఎండీ నోటి వెంట

ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ సభల్లో తరచూ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా గురించి చెప్పాల్సి వచ్చిన సందర్భంలో చెప్పే డైలాగ్​ ఒకటి ఉంది. మీకు గుర్తుందా.. అదేనండీ.. 'ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త'.  బీఆర్​ఎస్ సర్కార్​నిరంతర విద్యుత్తు సరఫరా కోసం కృషి చేస్తోందని చెప్పడానికి ఆయన వాడే డైలాగ్​ఇది. ఇప్పుడు ఇదే డైలాగ్​ట్రాన్స్ కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు నోటి వెంట వచ్చింది. 

ఆయన జులై 17న మీడియాతో మాట్లాడుతూ.. కరెంటు ఎన్ని గంటలు ఇచ్చింది ముఖ్యం కాదని.. పంటలు ఎండినట్లు ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని అన్నారు. కరెంట్​సరఫరాకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఒకప్పుడు కరెంట్​ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్​ పోతే వార్త అని ప్రభాకర్​ రావు అనడం గమనార్హం. 

స్పష్టత ఇవ్వని సీఎండీ..

కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పార్టీల మధ్య వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరెంట్​పై రాజకీయ యుద్ధం జరుగుతున్న తరుణంలో ప్రభాకర్ రావుని ఇదే అంశంపై ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. కాంగ్రెస్​ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి 24 గంటల విద్యుత్తు సరఫరా కావట్లేదన్న ఆరోపణలను ఆయన వద్ద ప్రస్తావించగా స్పందించలేదు. 24 గంటల కరెంటుపై స్పష్టత ఇవ్వని ఆయన.. మీరు ఏ రిపోర్టర్​ అని తిరిగి ప్రశ్నించడం గమనార్హం.

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రభాకర్​రావు

సీఎండీ ప్రభాకర్​రావు రాజన్న సిరిసిల్ల జిల్లా వేముల వాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.