రాష్ట్రానికి హైకోర్టు సూచన
హైదరాబాద్, వెలుగు : ట్రాన్స్జెండర్లను ఆసరా స్కీంతో ఆదుకోవాలని రాష్ట్ర సర్కార్కు హైకోర్టు సూచన చేసింది. రూల్స్ అనుమతిస్తే ఆసరా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడంపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం స్పందించింది. ఈ అంశాన్ని టెక్నికల్గా చూడొద్దని.. సమాజంలో చిన్న చూపునకు గురయ్యే ట్రాన్స్జెండర్లను ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుకు ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కరోనా టైంలో ట్రాన్స్జెండర్లకు వ్యాక్సిన్, ఉచిత రేషన్ ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వైజయంతి వసంత మొగలి అలియాస్ ఎం.విజయకుమార్ పిల్ వేశారు. దానిపై హైకోర్టు విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు లాయర్ జైనాబ్ వాదిస్తూ.. ఆసరా వంటి స్కీం అమలుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి సర్వేలో 58 వేల మంది ట్రాన్స్జెండర్లు ఉంటే.. కేవలం 12 వేల మందికే వ్యాక్సిన్ వేశామనడం సరికాదని ప్రభుత్వ ప్లీడర్ రాథీవ్రెడ్డి చెప్పారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నామని కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది.