ఆర్టీసీని కేసీఆర్ కాపాడారు.. రోజుకు రూ.15కోట్ల ఆదాయం : మంత్రి పువ్వాడ

ఆర్టీసీని కేసీఆర్ కాపాడారు.. రోజుకు రూ.15కోట్ల ఆదాయం : మంత్రి పువ్వాడ

తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 101 ప్రాంతాల్లో బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో బ్లడ్ డొనేషన్ క్యాంపును రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం (జూన్ 27న) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రక్తదానం ప‌ట్ల సిబ్బందిలో, ప్రజ‌ల్లో చైత‌న్యం కల్పిస్తూ.. ఆర్టీసీ సంస్థ కొన్నేళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని డిపోలు, ప్రధాన బస్ స్టేషన్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోని ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ నిర్వహణను మంత్రి పువ్వాడ అజయ్ పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించి, అడిగి తెలుసుకున్నారు. 

ఆర్టీసీ పురోగతి కోసం ప్రజల నుంచి మద్దతు వస్తోందని, ఇప్పుడు రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థల్లో ఇబ్బందులు ఉన్నాయని, వాటితో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీ చాలా బెటర్ గా ఉందన్నారు. ఈనెల (జూన్) ఆషాఢం వల్ల రెవెన్యూ తగ్గుతుందన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొత్త కొత్త కార్యక్రమలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం  ఆర్టీసీ రూ.500 కోట్ల నష్టంలో ఉందని, గత ఏడాది రూ.1900 కోట్ల నష్టం తగ్గించుకున్నామన్నారు. 760 కొత్త బస్సులు ప్రారంభించామన్నారు. త్వరలో సిటీలో ఎలక్ట్రిక్ బస్సులను స్టార్ట్ చేస్తామన్నారు. బస్సులు, బస్టాండ్ లు మంచిగా ఉంటే ప్రయాణికుల నుంచి మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది 150 బస్ స్టాండ్ లు ఆధునికీరణ చేస్తామన్నారు. 

‘‘తెలంగాణ రాష్ర్టం వచ్చిన తర్వాత MGBS, JBS బస్టాండ్ల నుంచి ఎక్కువ మంది జర్నీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల వసతులు మంచిగా ఉండాలి. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది. ఎయిర్ పోర్ట్, మెట్రోకు కనెక్టివిటీ పెంచుతాం. 45 వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆర్టీసీతో ప్రతి వ్యక్తికి ఎంతో అనుబంధం ఉంటుంది’’ అని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు.  

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడారని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. దీనిపై ఫైనాన్స్ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోసమే తాము పీఆర్సీ ఇవ్వలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికులకు అపాయింట్ మెంట్ ఇస్తున్నామని చెప్పారు.‘‘ఆర్టీసీ సంస్థ మీద నెగిటివ్ వార్తలు రాయకండి...ప్రైవేట్ ట్రావెల్స్ మీద నెగిటివ్ వార్తలు రాయండి’’ అంటూ మాట్లాడారు మంత్రి పువ్వాడ అజయ్. 

ALSOREAD:Cricket World Cup 2023 : ఇండియా – పాక్ మ్యాచ్ డేట్, స్టేడియం ఫిక్స్

ప్రైవేటు ట్రావెల్స్ ను అడ్డుకోలేమని, దీనిపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఓలా, ఉబర్ ప్రైవేటు ట్యాక్సీలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తమకు ప్రైవేటు వెహికిల్స్ ప్రధాన పోటీ అని వాటిని నిలవరించలేమన్నారు. ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాదిరిగా ఇక్కడ కూడా అలాంటి ప్రతిపాదన గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు మంత్రి పువ్వాడ అజయ్.