- నెల రోజుల పాటు 22 డిపార్ట్ మెంట్స్ లో ఓపీ సేవలు
- అధికారులకు మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సనత్ నగర్ లోని తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్ )ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు నేటి నుంచి హాస్పిటల్ లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి సుమారు నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుంది.
ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్ , డయాగ్నసిస్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీతో పాటు మొత్తం 22 డిపార్ట్ మెంట్లలో ట్రయల్ రన్ జరుగనుంది. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని అధికారులు ఇప్పటికే నియమించారు.

