సత్తుపల్లిలో ఉద్రిక్తత.. పోలీసులను చితకబాదిన గిరిజనులు

సత్తుపల్లిలో ఉద్రిక్తత.. పోలీసులను చితకబాదిన గిరిజనులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డుకున్న పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్ తో సహా మరో నలుగురు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

గత కొంతకాలంగా చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2024 మార్చి 31 ఆదివారం బుగ్గపాడు, చంద్రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు మధ్య వాగ్వాదం జరుగుతుండటంతో.. విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లారు. దీంతో పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. సీఐ కిరణ్ పై గిరిజనులు కర్రలతో దాడి చేశారు. సీఐని కాపాడేందుకు ప్రయత్నించిన మరో నలుగురు సిబ్బందిపై కూడా గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. గిరిజనుల దాడి నుంచి అతి కష్టంపై సీఐ తప్పించుకుని బయటపడ్డారు.