ఔట్​సోర్సింగ్​ వర్కర్లను పర్మినెంట్​ చేయాలి

ఔట్​సోర్సింగ్​ వర్కర్లను పర్మినెంట్​ చేయాలి

హైదరాబాద్, వెలుగుగిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న తమను పర్మినెంట్​ చేయాలని డిమాండ్​ చేస్తూ ఔట్​సోర్సింగ్, డైలీ వేజ్​ వర్కర్లు సోమవారం హైదరాబాద్​లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్​ కార్యాలయాన్ని ముట్టడించారు. తమను పర్మినెంట్​ చేయాలని, అందరికీ సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్​లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేస్తూ రెండు గంటల పాటు వర్షంలోనే ధర్నా చేశారు. వర్కర్లు, సీఐటీయూ నేతలతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్​ క్రిస్టినా చర్చలు జరిపారు. పెండింగ్​లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లిస్తామని, ప్రతి కార్మికుడి వ్యక్తిగత ఖాతాలోనే వేతనం జమచేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి, కమిషనర్​ హామీ ఇచ్చారు. అన్ని జిల్లాల్లో కనీస వేతనాల సర్క్యులర్​ను అమలు చేసి ఎరియర్స్​ కూడా చెల్లిస్తామన్నారు.

జీవో 212, 16 అమలు ప్రభుత్వ పరిశీలనలో ఉందని, న్యాయ, పరిపాలన సంబంధమైన అన్ని విషయాలను పరిశీలించి పర్మినెంట్​ చేసే అంశంపై చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తింపు కార్డులు, వేతనాల చెల్లింపులకు అవసరమైన వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి చెప్పడంతో వర్కర్లు ధర్నాను విరమించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్​ మాట్లాడుతూ మంత్రి, కమిషనర్​ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. హామీల అమలు కోసం జిల్లాలోని ఐటీడీఏ పీవో, డీటీడీవో, కలెక్టర్​ ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ధర్నాలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్​ ఎస్​రమ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, డైలీ వేజ్​ వర్కర్ల యూనియన్​ రాష్ట్ర అధ్యక్షుడు టేకం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బి.మధు, నేతలు సురేందర్, మంగమ్మ, తార్యా, బ్రహ్మచారి, రాజేందర్​ తదితరులు పాల్గొన్నారు.