తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాపై వేటు పడనుందా..? ఆమె లోక్ సభ సభ్యత్వం రద్దవుతుందా..? ఒకవేళ ఆమెపై అనర్హత వేటు వేస్తే.. ఆ తర్వాత ఆమె అడుగులు ఎటువైపు..? భవిష్యత్తు ప్రణాళిక ఏంటి..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారంటూ ఎంపీ మహువా మొయిత్రా రాజకీయంగా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై అనర్హత వేటుపడే అవకాశం కనిపిస్తోంది. నైతిక విలువల కమిటీ లోక్సభకు ఈ నివేదికను సమర్పించిన తర్వాత మొయిత్రాపై అనర్హత వేటు వేయాలని కేంద్రం కోరనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో 4వ తేదీన నైతిక విలువల కమిటీ.. ఆ నివేదికను లోక్సభ ముందు ఉంచనుందని తెలుస్తోంది.
లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. కమిటీ నివేదికను పరిశీలించేందుకు బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశమైంది. ఆ తర్వాత దానిని 6:4 మెజారిటీతో ఆమోదించింది.
మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్ కమిటీ చెప్పింది. అందుకే ఆమెను లోక్సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సమావేశాల్లో దానిని ప్రవేశపెట్టి చర్చ జరిపే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆమెపై అనర్హత వేటు వేయాలని కేంద్రం కోరనుందని తెలుస్తోంది.