యాదాద్రి జిల్లాలో విడతలుగా ట్రిపుల్ఆర్ పరిహారం

యాదాద్రి జిల్లాలో  విడతలుగా ట్రిపుల్ఆర్ పరిహారం
  •     ఐదో విడతలో వంద మందికి రూ. 5.30 కోట్లు
  •     తుర్కపల్లి, చౌటుప్పల్​ 'కాలా' పరిధిలో​ పేమెంట్స్​
  •     ఇప్పటివరకూ 815 అకౌంట్లలో రూ. 79.87 కోట్లు

యాదాద్రి, వెలుగు:  ట్రిపుల్​ ఆర్​ ఉత్తర భాగం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు విడతల వారీగా పరిహారం అందుతోంది. గడిచిన నాలుగు నెలల్లో నాలుగు విడతల్లో  పరిహారం అందించగా , తాజాగా మరో వంద మందికి పరిహారం ఇవ్వడానికి ప్రాసెస్​ రెడీ అయింది. భారత్​ మాల పరియోజనలో భాగంగా యాదాద్రి జిల్లాలో ట్రిపుల్​ఆర్​ఉత్తర భాగం నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే.  

భూసేకరణ నోటిఫికేషన్​ను 2022లో జారీ చేశారు. జిల్లాలోని  ఐదు మండలల్లోని 24  గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రోడ్డుకు మొత్తంగా 1795 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.  దీని కోసం  జిల్లాలో తుర్కపల్లి, భువనగిరి, చౌటుప్పల్ ‘కాలా’ కాంపిటెంట్ అథారిటీ ల్యాండ్ అక్విషన్ లను ఏర్పాటు చేసి, వీటికి అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవోలను బాధ్యులుగా నియమించారు. 

తుర్కపల్లిలో 311 ఎకరాలకు ..

తుర్కపల్లి ‘కాలా’  పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూ సర్వేతో పాటు బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్టక్చర్​ఎంక్వైరీ ముగిసింది. ఈ పరిధిలో మొత్తంగా 510.38 ఎకరాలు సేకరించాల్సి ఉంది.  ఇప్పటి వరకూ 268 ఎకరాలకు పరిహారం అందగా తాజాగా 42 ఎకరాలకు పంబంధించి వందమంది వివరాలను భూమి రాశి పోర్టల్లో అప్​లోడ్​ చేశారు. 

పోర్టల్​లో అప్​లోడ్​ అయిన డిటైల్స్​ను నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా పీడీ, జీఎం వేర్వేరుగా పరిశీలించారు.  వీరి ఖాతాల్లో రూ. 5.30 కోట్లు పరిహారం ఒకటి రెండ్రోజుల్లో జమ కానుంది.  సర్వే పూర్తయిన తుర్కపల్లి కాలా పరిధిలో ఇప్పటివరకూ 647 అకౌంట్లలో విడతల వారీగా పరిహారం జమ చేసింది. 

 చౌటుప్పల్​లో 80 ఎకరాలకు

 చౌటుప్పల్ కాలా పరిధిలో 795 ఎకరాల వరకూ సేకరించాల్సి ఉంది. ఈ కాలా పరిధిలోని రెడ్లరేపాక, పహిల్వాన్​పురం,  చౌటుప్పల్​ పరిధిలోని 80 ఎకరాలకు సంబంధించిన 140 అకౌంట్లలో రూ. 22 కోట్లు పరిహారం జమ చేశారు. చౌటుప్పల్​ పరిధిలో కొంతమేర జరగగా భువనగిరి ‘కాలా’ పరిధిలోని రైతులు తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోకుండా ఆందోళనలు నిర్వహించి సర్వేను అడ్టుకోవడంతో ఆగిపోయింది.