
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ , ఫలితాలపై టీఆర్ఎస్ నేత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రధాని మోడీకి పూర్తి మెజారిటీ చేస్తే తాము చేసేదేమీ లేదన్నారు. తాము మోడీ ప్రభుత్వంలో కలువబోమని, గతంలో లాగే బయటి నుంచే సపోర్ట్ చేయొచ్చని అన్నారు. మోడీకి అవసరం లేకపోతే తామంతట తాము వెళ్లి కలవం అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి…అడగకున్నా వెళ్లి కలిసేందుకు తామేం చంద్రబాబు కాదని అన్నారు.
ఆంధ్రజ్యోతి దిన పత్రిక తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని అన్నారు ప్రశాంత్ రెడ్డి. ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నామని మీడియాతో చెప్పారు. ఈ విషయానికి సంబంధించి ఆ పత్రికపై ప్రెస్ కౌన్సిల్ లో టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేస్తుందన్నారు.
మిషన్ భగీరథ 100శాతం గ్రామాలకు చేరింది
తమ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పథకం 100 కు వంద శాతం గ్రామాలకు చేరిందన్నారు ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రంలో 90 శాతం ఇళ్లకు మిషన్ భగీరథ నీళ్ళు చేరాయని మంత్రి చెప్పారు.