బీజేవైఎం లీడర్లపై టీఆర్ఎస్​ లీడర్ల రాళ్ల దాడి

బీజేవైఎం లీడర్లపై టీఆర్ఎస్​ లీడర్ల రాళ్ల దాడి

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాలో రాత్రికిరాత్రే రైతు వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో తీసేయడంపై నిరసన తెలిపిన బీజేవైఎం నాయకులపై టీఆర్ఎస్​ లీడర్లు రాళ్ల దాడి చేశారు. మండలంలోని భైరంకొండ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక బిల్డింగ్​పై ఆఫీసర్లు సీఎం కేసీఆర్, పీఎం మోడీ ఫొటోలు వేయించారు. ఆదివారం ఉదయం ప్రారంభం కావాల్సి ఉండగా శనివారం అర్ధరాత్రి పీఎం ఫొటోను తొలగించారు. దాన్ని గుర్తించి స్థానిక బీజేపీ లీడర్లు గొడవ చేస్తారేమోనని ఆదివారం తెల్లవారుజామున బీజేపీ మండల అధ్యక్షుడు సాయిబన్న, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయాదవ్, టౌన్​అధ్యక్షులు రఘురామయ్యగౌడ్, రామకృష్ణను పోలీసులు స్టేషన్​కు తరలించారు. ఉదయం ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి రైతు వేదికను ప్రారంభిస్తుండగా అక్కడికి చేరుకున్న బీజేవైఎం లీడర్లు మోడీ ఫొటోను తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. పోలీసుల ముందే టీఆర్ఎస్​లీడర్లు కొందరు రాళ్లతో బీజేవైఎం నాయకులపై దాడి చేశారు. ఆ వెంటనే పోలీసులు బీజేవైఎం వాళ్లను స్టేషన్​కు తరలించారు. పేరపళ్ల గ్రామంలోనూ బీజేవైఎం నాయకులను అరెస్టు చేశారు. పీఎం ఫొటో తొలగించటానికి సహకరించిన ఆఫీసర్​పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. తమ నాయకులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ ​చేశారు.