జిల్లాల్లో పార్టీ ఆఫీసు నిర్మాణానికి రూ.60 లక్షలు : కేసీఆర్

జిల్లాల్లో పార్టీ ఆఫీసు నిర్మాణానికి రూ.60 లక్షలు : కేసీఆర్

హైదరాబాద్ : దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని పార్టీ నేతలకు తెలిపారు సీఎం కేసీఆర్‌. తెలంగాణభవన్‌లో TRS నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. ఇప్పటికే 29 జిల్లాల్లో శంకుస్థాపనలు కూడా పూర్తయ్యాయి. పార్టీ ఆఫీసుల నిర్మాణానికి సంబంధించిన బాధ్యులకు ఇవాళ చెక్కులు అందజేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కును, భవన నిర్మాణ ప్రణాళికను అందించారు.

నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు కేసీఆర్‌ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదుపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటు కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. పోడు భూముల వ్యవహారాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు KCR దృష్టికి తీసుకొచ్చారు. పోడు రైతులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. త్వరలో వీటన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.