- వాయిదా పడిన స్థానాల్లో ఎంపీపీల ఎన్నిక
- రెండుచోట్ల టీఆర్ఎస్ రెబల్స్ విజయం
వెలుగు నెట్ వర్క్: గతంలో వాయిదా పడ్డ ఎంపీపీల ఎన్నికను వివిధ జిల్లాల్లో శనివారం నిర్వహించారు. జనగామ జిల్లా తరిగొప్పులలో టీఆర్ఎస్కు చెందిన జొన్నగోని హరిత, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి బంసోడ రాణీబాయి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎంపీపీగా రాథోడ్ పుండలిక్(ఇండిపెండెంట్), మహబూబ్నగర్ రూరల్ ఎంపీపీగా సుధాశ్రీ గౌడ్(టీఆర్ఎస్), ఆమనగల్లు ఎంపీపీగా అనిత(టీఆర్ఎస్), మాడ్గులలో గౌరారం పద్మ(కాంగ్రెస్), సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి ఎంపీపీగా ప్రియాంక(కాంగ్రెస్), మెదక్జిల్లా టేక్మాల్ఎంపీపీగా స్వప్న(కాంగ్రెస్) ఎన్నికయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా గెలిచిన విజయలక్ష్మీ టీఆర్ఎస్లోకి వెళ్లి కాంగ్రెస్కు షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు మద్దతు లభించలేదు. ఊహించని విధంగా టీఆర్ఎస్ అభ్యర్థులు, ఇండిపెండెట్ అభ్యర్థి మద్దతు లభించటంతో ఆమె ఎంపీపీగా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో టీఆర్ఎస్ ఏలేటి మమతను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించి బీ ఫాం అందజేసింది. ఎన్నిక సమయంలో అనూహ్యంగా టీఆర్ఎస్ రెబల్ ఎంపీటీసీ కోల జమున పోటీ పడ్డారు. ఎవరికీ మెజార్టీ లేకపోవడంతో గతంలో ఎన్నిక వాయిదా వేశారు. శనివారం కోల జమునకు మెజార్టీ లభించడంతో ఆమెను ఎంపీపీగా ప్రకటించారు. జగిత్యాల అర్బన్ ఎంపీపీగా మ్యాదరి వనిత(కాంగ్రెస్), నల్గొండ జిల్లా కేతేపల్లిలో పెరుమాళ్ల శేఖర్(కాంగ్రెస్), చిలుకూరులో బండ్ల ప్రశాంతి కుమారి(టీఆర్ఎస్ రెబల్), చందంపేటలో నున్సావత్ పార్వతి(కాంగ్రెస్), నేరేడుగొమ్ములో బాణావత్ పద్మ(టీఆర్ఎస్) ఎంపీపీలుగా ఎన్నికయ్యారు.
పలుచోట్ల మళ్లీ వాయిదా
పలుచోట్ల మరోసారి ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొత్త గూడెం జిల్లా ఆల్లపల్లి, ముల్కలపల్లి ఎంపీటీసీ పరిధిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక రెండోసారి కూడా జరగలేదు. ఆల్లపల్లి లో కో ఆప్షన్ ఎన్నిక పూర్తి కాగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఇక జగిత్యాల జిల్లా జగిత్యాల ఎంపీటీసీ పరిధిలో వైస్ ఎంపీపీ ఎన్నిక శనివారం కూడా వాయిదా పడింది.