నాగపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి

నాగపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి

నాగపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కటోల్ తాలూకాలోని సోంఖంబ్ గ్రామం సమీపంలో డిసెంబర్ 16వ తేదీ శనివారం తెల్లవారుజామున ఓ ట్రక్కు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వానికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్న తెలుస్తోంది. కారు..  నాగ్ పూర్ నుంచి కటోల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిని అజయ్ దశ్రత్ చిఖ్లే(45), విఠల్ దిగంబర్ తోటే (45), సుధాకర్ రామచంద్ర మాన్కర్ (42), రమేష్ ఓంకార్(48), మయూర్ మోరేశ్వర్ ఇంగ్లే (26), వైభవ్ సాహెబ్రావ్ చిఖ్లే (32)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.