
- పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి
- కేంద్రానికి టీఎస్ఎఫ్ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సోషల్ ఫౌండేషన్ (టీఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. ఆదివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండేషన్ చైర్మన్ ఒంటెద్దు నర్సింహారెడ్డి అధ్యక్షతన ‘తెలంగాణ జలవనరులు-, వ్యవసాయం- నాడు, నేడు, రేపు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే రెండు రాష్ట్రాలకు నీటి వాటాలను తేల్చాలి. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు రూపొందించిన పోలవరం–శ్రీశైలం-కృష్ణానది మార్గం పథకాన్ని కేంద్రం పరిశీలించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అపెక్స్ కౌన్సిల్, కేంద్రానికి నివేదించాలి. గోదావరి వరద జలాల్లో 1,950 టీఎంసీలకు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయాలి” అని కోరారు. ‘‘కుంగిన మేడిగడ్డ ఏడో బ్లాక్కు రాష్ట్ర ప్రభుత్వం రిపేర్లు చేయాలి. రైతుల ఆత్మహత్యలను నివారించడంతో పాటు బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి” అని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సాగునీటి రంగనిపుణులు శ్రీధర్ రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.