హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముగింపు దశకు చేరుకున్నది. వారం రోజుల్లో ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ కేసులో ఇప్పటికే 107 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. మరో 10 మంది నిందితులను గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించనుంది. ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్ సహా మొత్తం 36 మందిపై జూన్ 9న సిట్ ప్రిలిమినరీ చార్జ్ షీట్ ఫైల్ చేసింది.
ఆ తర్వాత అరెస్ట్ అయినోళ్ల వివరాలు, సాక్ష్యాధారాలతో దాదాపు 100 పేజీలతో మరో చార్జ్ షీట్ సిద్ధం చేసింది. 70 మందికి పైగా నిందితుల వివరాలతో కూడిన ఈ చార్జ్ షీట్ను కోర్టుకు అందించనుంది. గ్రూప్ 1, డీఏఓ, ఏఈఈ, ఏఈ సహా మొత్తం ఆరు పేపర్ల లీకేజీపై ఈ ఏడాది మార్చి11న బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సీసీఎస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. టీఎస్ పీఎస్సీ సెక్రటరీ మాజీ పీఏ పులిదిండి ప్రవీణ్ కుమార్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అట్ల రాజశేఖర్ కలిసి పేపర్ల లీకేజీకి కుట్ర చేసినట్టు గుర్తించారు.
కాన్ఫిడెన్సియల్ సెక్షన్లో ఉండే కంప్యూటర్ నుంచి గ్రూప్-1, డీఏఓ, ఏఈఈ, ఏఈ పరీక్ష మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పెన్ డ్రైవ్లోకి డౌన్లోడ్ చేసుకున్నారని ఆధారాలు సేకరించారు. ప్రిలిమినరీ చార్జ్ షీట్ దాఖలు చేసే సమయానికి 49 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 36 మందిపై అభియోగాలు మోపుతూ చార్జ్ షీట్ వేశారు.
-