బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. పండుగల నేపథ్యంలో #TSRTC నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం(అక్టోబర్ 18) నుంచి ప్రారంభమవుతుందని ఆర్టీసీ ప్రకటించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులను సంస్థ అందిస్తుందని ఆర్టీసీ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30 వరకు లక్కీడ్రా కొనసాగుతుందని ఆర్టీసీ తెలిపింది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో ప్రయాణికులు వేయాలని పేర్కొంది.
బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను ఎంపికచేస్తామని అధికారులు తెలిపారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులను సంస్థ అందిస్తుందని ప్రకటించారు.
ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుందని ఆర్టీసీ వెల్లడించింది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకొని.. టీఎస్ఆర్టీసీని ఆదరించాలని సంస్థ కోరింది.