అప్పుల బాధతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

అప్పుల బాధతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
  • సిద్దిపేట జిల్లాలో ఘటన

హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటకుంటతండాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మాలోత్ మోబి (52) అప్పుల బాధతో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మాలోత్​ మోబి సిద్దిపేటలోని ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్​గా  పనిచేస్తున్నాడు. కొన్నేండ్ల కింద తండా నుంచి అక్కన్నపేట మండలం గండిపల్లికి షిఫ్ట్ అయ్యాడు. తండాలో వ్యవసాయ భూములున్నాయి. ముగ్గురు బిడ్డల పెండ్లిళ్ల కోసం రూ.6లక్షల దాకా అప్పు చేశాడు.

వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పు కట్టలేకపోయాడు. డ్రైవర్ గా పని చేస్తున్నా.. వచ్చే జీతం కుటుంబ పోషణ, మిత్తీలకు కూడా సరిపోయేది కాదు. దీంతో అప్పు ఎలా తీర్చాలనే బెంగపెట్టుకున్నాడు. శనివారం మధ్యాహ్నం చౌటకుంట తండాలోని తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన కొందరు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివేక్​ తెలిపారు.