జేబీఎస్ బస్ స్టేషన్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ...

జేబీఎస్ బస్ స్టేషన్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ...

హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిసెంబర్ 11వ తేదీ సోమవారం జేబీఎస్ బస్ స్టేషన్కు వెళ్లిన ఆయన ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యంపై మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. 

జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్(రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ను అందజేశారు. 

అనంతరం వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి.. -మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. మహిళల ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ గొప్ప కార్యక్రమంలో తనను టీఎస్ఆర్టీసీని భాగస్వామిగా చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 

మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత బస్ ప్రయాణ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి.. వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి.. సంస్థకు సహకరించాలని కోరారు. 

ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్లాన్ రూపొందించామని చెప్పారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సమయనం పాటించి..  సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లైనా 040-69440000, 040-23450033  ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు.