- బస్ భవన్ వద్ద ఆందోళన
- పెంచిన పనిభారం తగ్గించాలి
- ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి
- 13 నెలల డీఏ బకాయిలు చెల్లిం చాలి
- టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ జిల్లాలకు చెందిన కార్మికులు బస్ భవన్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. పే స్కేల్ ను వెంటనే అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రామ్ చందర్, ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. “పెంచిన పని భారం తగ్గించాలి. పని వేళల పెంపు ఆపాలి. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి. సీపీఎస్, పీఎస్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీసీ తదితర సంస్థల బకాయిలు వెంటనే చెల్లించాలి. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 2019 జనవరి డీఏను వెంటనే అమలు చేయాలి. 13నెలల డీఏ బకాయిలు చెల్లించాలి. అద్దె బస్సులను రద్దు చేయాలి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనాలి. మోటారు వాహనాల చట్టం, మోటారు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ చట్టం సక్రమంగా అమలు చేయడం లేదు. టీఎస్ ఆర్టీసీగా ప్రారంభమైన రోజు నుంచి కొత్త రిక్రూట్మెంట్ లేదు. 2014 -15లో 56,740 మంది ఉద్యోగులు, కార్మికులుంటే 2019 మార్చి నాటికి 50,656కు తగ్గిపోయారు. మహిళా కండక్టర్లకు ప్రత్యేక డ్యూటీ చార్ట్ లు వేయాలి. అన్ని కేటగిరీల్లో మెరుగైన పనిముట్లు, స్పేర్ పార్ట్స్ అందించాలి. సిటీలో నైట్ అవుట్ సర్వీసుల్లో సరైన వసతులు, రక్షణ కల్పించాలి”అని విన్నవించారు. డీజిల్ పెరుగుదల భారాన్ని ఆర్టీసీకి సర్కారు చెల్లించాలన్నారు. ఆర్టీసీకి రాష్ట్ర బడ్జెట్లో ఒక శాతం నిధులు కేటాయించి పన్నుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.