
భక్తులకు కీలక అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి ఆలయంలో జులై 17న బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపింది. ఆ రోజు స్వామివారికి సాలకట్ల ఆణివార ఆస్థాన కార్యక్రమం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో (జులై 17) ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా నిర్వహించనుంది టీటీడీ.. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది.
సంప్రదాయంగా ఆణివార ఆస్థానం
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి - ఏప్రిల్ నెలలకు మార్చడం జరిగింది. అయినప్పటికీ సంప్రదాయంగా ఆణివార ఆస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల్లో శ్రీవారి ఊరేగింపు
ఆదివారం ( జులై 16) బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేం చేశారు. మరో పీఠంపై స్వామి వారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారిని దక్షిణాభి ముఖంగా ఆవాహన చేశారు.. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, ప్రసాదాలు నివేదించారు అర్చకులు.. ఆణివార ఆస్థానం సందర్భంగా (జులై 17)సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. జులై 17 ఉదయం ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్న కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు.