
తిరుమలలో సామాన్య భక్తుల కోసం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 23 ఆదివారం నుంచి పీఏసీ-1 వద్ద ఫుడ్ కౌంటర్ ను ప్రారంభించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కౌంటరులో ముందుగా శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని ప్రారంభించారు.
ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. పీఏసీ-1లో బస చేసే సామాన్య భక్తులకు ఈ ఫుడ్ కౌంటర్ సౌకర్యవంతంగా ఉంటుందని వెల్లడించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పీఎసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. వీటితోపాటు రాంభగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఫుడ్ కౌంటర్లు ఉన్నాయి. దీంతో కలిపి మొత్తం ఫుడ్ కౌంటర్లు మూడుకు చేరాయి.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది . ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. మొత్తం 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు. శనివారం (ఏప్రిల్ 22)న స్వామివారిని 72,631 మంది భక్తులు దర్శించుకోగా 38,529 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.