
- మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన టికెట్లు జారీ
తిరుపతి: తిరుమలలో ఈనెల 12వ తేదీ నుంచి 14వతేదీ వరకు మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సేవకు సంబంధించిన టికెట్లు ఒకరోజు ముందు నుంచి అంటే జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో కరంట్ బుకింగ్లో భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. రోజుకు 600 టికెట్ల చొప్పున విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.
జ్యేష్టాభిషేకం టికెట్ ధర 400
జ్యేష్టాభిషేకం టికెట్ ధర 400 రూపాయలుగా నిర్ణయించారు. సిఆర్వో కార్యాలయానికి ఎదురుగా ఉన్న కౌంటర్లో భక్తుల ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ తీసుకుని టికెట్లు జారీ చేస్తారు. సేవకు ఒక రోజు ముందుగా మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన టికెట్లు మంజూరు చేస్తారు. ఒక చిన్న లడ్డూ ప్రసాదంగా అందజేస్తారు. సేవా టికెట్లు పొందిన భక్తులు ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలి. ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణోత్సవ మండపంలో జ్యేష్టాభిషేకం జరుగుతుంది. సేవ అనంతరం భక్తులను మహా లఘుదర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం స్పష్టం చేసింది.