
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మధ్యాహ్నం అత్యవసర సమావేశమైన అధికారులు.. తిరుమలకు భక్తులు వచ్చే రెండవ ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే అలిపిరి టోల్గేట్ మూసివేసి వాహనాలను కొండపైకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖాళీ బస్సులను మాత్రమే పైకి అనుమతిస్తున్నారు. కొండపైనున్న భక్తులను కూడా క్రిందకు పంపుతున్నట్టు సమాచారం. అంతే కాదు.. ఈ రోజు సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మెట్ల మార్గాన్ని కూడా మూసేశారు. కరోనా వైరస్ నేపధ్యంలో అన్ని ప్రముఖ దేవాలయాలు మూసివేయాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేయడంతో టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. అయితే.. శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని టీటీడీ అధికారులు చెప్పారు. కాగా.. శుక్రవారం ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్డులు మూసివేస్తామని ప్రకటించారు.